మిగిలిన పరీక్షలు కూడా రద్దు చేసి పాస్ చేయాలి.. జగన్ సర్కార్‌కు పవన్ రిక్వెస్ట్


విద్యార్థుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని.. విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం అన్నారు పవన్. పదో తరగతి రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. డిగ్రీతోపాటు ఎం.బీ.ఏ., ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐ.టీ.ఐ వంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదన్నారు.

విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్‌లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు పై చదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్‌ సెలెక్షన్స్‌‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్‌ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని.. పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్ధులు జనసేన దృష్టికి తీసుకువచ్చారని.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి అన్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు జనసేన అధినేత. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్‌‌ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున పవన్ పేరు మీద ప్రకటన విడుదల చేశారు

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad