ముంచుకొస్తున్న మరొక ముప్పు...! ఆందోళనకర విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి

 
e-Waste

వాషింగ్టన్‌: మనం నిత్యం వాడుతున్న మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మిషన్లు, ఎలక్రిక్‌ వస్తువులు, ఇతర గాడ్జెట్లు...  విచ్చలవిడిగా పెరుగుతున్న వాడకమే కాదు. వీటవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్‌ వేస్టేజ్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 52.7 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా అందులో కేవలం 17.4 శాతం మాత్రమే సేకరించి రీసైకిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను తిప్పికొట్టడంలో ఎంతో దోహదం చేస్తుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయ పడింది. 

గత ఏడాది మొత్తం ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాలలో ఆసియా పెద్దమొత్తంలో అనగా సుమారు - 46.4 శాతం ఉత్పత్తి చేయగా తరువాత స్థానాల్లో అమెరికా (24.4 శాతం), యూరప్ (22.3 శాతం), ఆఫ్రికా (5.4 శాతం), ఓషియానియా (1.3 శాతం) ఉన్నాయి. ఐరాస‌ నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఈ-వేస్ట్‌కు అదనంగా 19.6 మిలియన్ టన్నులు జోడించి మొత్తం ఈ- వేస్ట్‌ 72.8 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ-వేస్ట్ సమస్య మరింత తీవ్రమవుతుందని నివేదిక హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఏసీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రిక్‌ దీపాల వాడకంతో పాటు స్మార్ట్‌ ఫోన్ల వినియోగం, తక్కువ లైఫ్‌టైం ఉన్న టెక్‌ గాడ్జెట్‌లు ఈ-వ్యర్థాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ-వేస్ట్‌పై పోరాడటానికి ప్రపంచ దేశాలకు 2014వరకు ఎలాంటి విధానాలు లేవు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ నియంత్రణ కోసం చట్టాలు, విధానాలు రూపొందించాయని నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఈ- వేస్ట్‌ నియంత్రణకు చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగిందని నివేదిక తెలిపింది. రాజకీయ కారణాల వల్ల ఇప్పటికి ఈ-వేస్ట్‌ నిర్వహణను పలు దేశాలు సరిగా అమలు చేయడం లేదని యూఎన్‌వో‌ తెలిపింది. ఐక్యరాజ్యసమితి టెలికాం శాఖ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సగానికి పైగా ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్‌ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుతం 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్‌ చట్టాలను రూపొందించాయి. 

2015 సెప్టెంబరులో యూఎస్‌, దాని సభ్య దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను ఆమోదించాయి. దీనిలో 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (ఎస్‌డీజీ),  ‘పేదరికాన్ని అంతం చేయడం, భూమిని పరిరక్షించడం,అందరి శ్రేయస్సుకు కృషి చేయడం’ వంటి 169 లక్ష్యాలను గుర్తించాయి. అయితే పెరుగుతున్న ఈ-వ్యర్థాలతో పాటు వాటిని అసురక్షిత పద్దతిలో ట్రీట్‌ చేయడం, కాల్చడం, పల్లపు ప్రదేశాలలో పారవేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించడానికి అవరోధం కలగడమే కాక మానవ ఆరోగ్యం పర్యావరణం దెబ్బతింటుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad