CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ స్కూళ్లు రికార్డు.. కేజ్రీవాల్ చేసిన మేజిక్ ఏంటి?


ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో సాధించిన ఉత్తీర్ణత శాతం.

2020: 98%
2019: 94.24%
2018: 90.6 %
2017: 88.2%
2016: 85.9%

ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంత భారీ సక్సెస్ సాధించడం వెనుక కారణం ఏంటి?. 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఓ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆ సమయంలో అరవింద్ ఇచ్చిన హామీని జనం లైట్ తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి హామీనే ఇస్తూ ఉంటారని అనుకున్నారు. కానీ, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు 2020లో సీబీఎస్ఈ ప్రకటించిన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ... ‘ప్రభుత్వ స్కూళ్లలో 98 శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇది చరిత్రాత్మకం. ఎడ్యుకేషన్ టీమ్, విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరికీ అభినందనలు.’ అని అన్నారు.

ఈ సారి ఫలితాల్లో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే.. వరుసగా ఐదో ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రికార్డు స్థాయి పర్సంటేజ్ నమోదు చేశాయి. రెండోది.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం నిర్లిప్తంగా ఉన్న సమయంలో ఓ రకమైన తీపి కబురు అందించాయి. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ ఫలితాలపై స్పందించారు. గత ఐదేళ్లుగా మా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు మాతో మేమే పోటీపడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాం. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. అంటూ ట్వీట్ చేశారు.

1. దేశంలోనే విద్యాశాఖకు అత్యధిక బడ్జెట్. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌లో 25 శాతం విద్య కోసమే కేటాయించారు. గత ఆరేళ్లుగా ఇదే కొనసాగుతుంది. దేశంలోనే విద్య కోసం కేటాయించిన అత్యధిక బడ్జెట్ ఇదే.

2. ఆరేళ్లలో రెట్టింపయిన క్లాస్ రూమ్‌లు: ఆరేళ్లలో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్ల క్లాస్ రూమ్‌లో రెట్టింపయ్యాయి. 17,000 నుంచి 37,000కి పెరిగాయి.

3. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు: ప్రభుత్వ స్కూళ్లలో స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియంలు, ల్యాబ్‌లు, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. దీంతో విద్యార్థులు స్కూల్‌కి వెళ్లడానికి, చదువు మీద ఆసక్తి పెరగడానికి దోహదపడింది.

4. కేంబ్రిడ్జ్, సింగపూర్, ఫిన్ లాండ్ నుంచి టీచర్ ట్రైనింగ్ : ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లకు అత్యుత్తమ సంస్థల నుంచి ట్రైనింగ్ లభించింది. వారు ఆ శిక్షణను సద్వినియోగం చేశారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు.

5. రాజకీయ నాయకులు నేరుగా పాలుపంచుకోవడం: సీఎం కేజ్రీవాల్ తరచూ విద్యార్థులు, టీచర్లతో మాట్లాడుతూ ఉంటారు. వారిలో ఉత్సాహన్ని, స్ఫూర్తిని నింపుతారు. గత ఏడాది కేజ్రీవాల్ స్వయంగా ఓ పేరెంట్ టీచర్ మీటింగ్‌కి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న మనీష్ సిసోడియా కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంటారు.

6. నిపుణుల సలహాలు : ఆక్స్ ఫర్డ్‌లో చదువుకున్న ఆప్ ఎమ్మెల్యే ఆతిషి సారధ్యంలోని కోర్ ఎడ్యుకేషన్ టీమ్ ఎన్జీవోలు, మోడల్ స్కూళ్ల నుంచి బెస్ట్ టాలెంట్‌ను ఢిల్లీ విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.

7. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ : విద్యార్థుల ఎదుగుదలతో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం తరచూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది.

8. ఎస్టేట్ మేనేజర్లుగా మాజీ ఆర్మీ ఉద్యోగులు : ఢిల్లీలోని ఇతర కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మాజీ ఆర్మీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్స్ అనే వారు విద్య మీద దృష్టి పెడతారు. మిగిలిన క్రీడా సంబంధిత అంశాలన్నీ ఈ ఎస్టేట్ మేనేజర్స్ చూసుకుంటారు.

9. విద్యాబోధనలో కొత్తదనం : విద్యాబోధనలో కొత్త కొత్త విధానాలను ప్రభుత్వం అవలంభిస్తోంది. మిషన్ చునౌతీ, మిషన్ బునియాద్ అనే ప్రోగ్రామ్స్ చేపట్టింది. దీని ద్వారా ప్రతి విద్యార్థి కూడా రాయడం, చదవడం నేర్చుకుంటారు. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు ఇంప్లిమెంట్ చేస్తుంది.

10. సాంకేతిక పరిజ్ఞానం: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు విద్యార్థులకు బోధించడానికి మొబైల్ ట్యాబ్లెట్స్ వాడతారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్టర్లు ఉంటాయి. ప్రపంచ స్థాయిలో నాలెడ్జ్ సాధించడానికి అనువైన వాతావరణం ఉంటుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad