ప్రతి తొమ్మిది మంది చిన్నారుల్లో ఒకరికి కరోనా : యునిసెఫ్‌

 న్యూఢిల్లీ : పిల్లలు, కౌమార దశలో ఉన్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరు కరోనా వైరస్‌ బారిన పడ్డారని యునిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నెల 3 నాటికి 87 దేశాల్లో కరోనా బారిన పడిన 2.57 కోట్ల మందిలో 11 శాతం పిల్లలు, కౌమార దశలో ఉన్నవారేనని నివేదిక తెలిపింది. పిల్లలు కరోనా బారినపడ్డారని, వ్యాప్తి చేస్తారనే అపోహ నిజం కాదని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెంరిఎట్టా ఫోర్‌ తెలిపారు. సంక్షోభం కారణంగా కీలక సేవలకు అంతరాయాలు కలగడం, పేదరికం పెరగడం చిన్నారులకు అతి పెద్ద ముప్పు అని అన్నారు. సంక్షోభం ఎంత కాలం కొనసాగితే అంతకాలం పిల్లల విద్య, ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సుపై దీని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందని, మొత్తం తరం భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మహిళల, చిన్నారుల కష్టాలు కరోనా వల్ల మరింతగా పెరిగాయని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. పాఠశాలల మూసివేతతో మధ్యాహ్న భోజనానికి ఆటంకం కలగడం, ఆర్యోగ సేవలకు అంతరాయం కలగడం అందుకు ప్రధాన కారణాలని పేర్కొంది.

పోషకాహార సమస్య

          కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పోషకాహార సమస్య మరింతగా పెరిగిందని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. యునిసెఫ్‌ అధ్యయనం చేసిన 135 దేశాల్లో కరోనా ముందుకాలంతో పోలిస్తే ఆరోగ్య సేవలు 10 శాతం, మహిళల, చిన్నారుల పోషకాహార సేవలు 40 శాతం క్షీణించాయి. సరైన భద్రతా చర్యలు పాటిస్తే పాఠశాలల మూసివేత కన్నా, పాఠశాల ప్రారంభమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని యునిసెఫ్‌ తెలిపింది. చిన్నారుల్లో పేదరికం పెరుగుదలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు యునిసెఫ్‌ విజ్ఞప్తి చేసింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad