దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 1.31 లక్షల పాజిటివ్ కేసులు, 802 మరణాలు.!

 దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది..

Corona Cases In India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,31,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 802 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.


నిన్న మహారాష్ట్రలో 56,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఛతీస్‌గడ్‌లో 10,652 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 8474, ఢిల్లీలో 7437, కర్నాటకలో 6570, కేరళలో 4353 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కరోనా కేసులు ప్రతీ రోజూ పెరుగుతోన్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.

దేశంలో మరోసారి లాక్‌డౌన్ లేదన్న మోదీ…

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ లేదని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని ప్రకటించారు.

ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశం లేదని ప్రధాని మోదీ రాష్ట్రాలకు తెలిపారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసుల పెరుగుదల ప్రమాదకరంగా ఉందని.. దీన్ని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయమని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూకి కరోనా కర్ఫ్యూగా పేరు పెట్టాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మోదీ.. కేసుల్ని తగ్గించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ తప్పదని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచడం…కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం ముఖ్యమని చెప్పారు.

 ఏపీలో కరోనా కల్లోలం.. ఊహించనంతగా పెరిగిన పాజిటివ్ కేసులు, ప్రమాదకరంగా మరణాలు

అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,15,832కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 7,268 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 8,93,651 మంది కోలుకున్నారు.

మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ కొరత ఆరోగ్యశాఖను తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రానికి సరిపడా డోస్‌లు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. దీంతో మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ అందుతుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి. అప్పుడు కోల్డ్‌చైన్‌ పాయింట్ల నుంచి రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రాల్లో నిల్వలు సున్నాకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరంగా కోటి డోస్‌ల వ్యాక్సిన్‌ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad