ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు

 ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు

 -ఏ ఒక్క అధికారీ బాధ్యత వహించడం లేదు

- అన్నీ బకాయిలేనా, ఇలా అయితే ఎలా

- సంక్రాంతి లోపు పీఆర్సీతో సహా అన్నీ  చెల్లించాలి

 - బండి శ్రీనివాసరావు, బొప్పరాజు జేఏసీల ఆగ్రహం


అక్టోబరు 7 - (ఉద్యోగులు.న్యూస్):   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉద్యోగుల ఐక్య వేదికలు రెండు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్ జీ వో సంఘం నేతృత్వం వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక, ఏపీ జేఏసీ అమరావతి ఒకే వేదికపైకి వచ్చాయి. ఉద్యోగులకు ఏ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించాయి.

ఉద్యోగుల సమస్యలపై కలిసి పోరాడాలని ఈ రెండు ఐక్య వేదికలు నిర్ణయించాయి. రెండు జేఏసీల ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ హృదయరాజు, వై వి రావులు .ఇతర నాయకులు గురువారం ఒకే వేదికపై వచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఒక్క అధికారికి కూడా  ఉద్యోగుల విషయాల్లో బాధ్యత లేకుండా పోయిందని, ఒక్క  ఆర్థికశాఖ అధికారి కూడా పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. జీతాలు, పెన్షన్లు, సరెండర్ లీవులు, పదవీ విరమణ చేసిన చేస్తున్న వారి ఆర్థిక బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మలు ఏవీ కూడా సకాలంలో  రావడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో ఆర్థికశాఖ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు వంటి హామీలను కూడా ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లయినా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతి నెలా ఒకటో తారీకునే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని వారు కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర పెండింగు బకాయిలు సంక్రాంతి లోపు చెల్లించాలని వారు గడువు విధించారు.  ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad