పెట్రోలు కొంచెం ఊరట.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే?

 పెట్రోలు కొంచెం  ఊరట.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే?

1627611930-petrol-image-4-1200x800

దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలకు కొంతమేర ఉపశమనాన్ని కలిగించేదే. కొన్ని రాష్ట్రాలు సైతం కేంద్రం బాటను అనుసరించాయి. ఆయా రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పిస్తూ వ్యాట్‌ను తగ్గించాయి. అసోం, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాలు వ్యాట్‌లో కోత విధించాయి. కేంద్రం తన నిర్ణయం ప్రకటించిన కాసేపటికే అసోం, త్రిపుర తమ నిర్ణయాన్ని ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు గురువారం ప్రకటన వెలువరించాయి. ఒక్క ఒడిశా మినహా తగ్గింపు ప్రకటించిన రాష్ట్రాలన్నీ దాదాపు భాజపా పాలిత, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం.

ఏయే రాష్ట్రాలు ఎంతెంత..?

తమ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై  రూ. 7 చొప్పున తగ్గిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలుపుకొంటే అక్కడ పెట్రోల్‌ రూ.12, డీజిల్‌ రూ.17 మేర తగ్గుతోంది.

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ సైతం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

కర్ణాటకలో బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపుతో రాష్ట్ర ఖజానాకు రూ.2100 కోట్ల మేర ఆదాయం తగ్గనుంది.

తమ రాష్ట్రంలో సైతం రూ.7చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.12, డీజిల్‌ ధర రూ.17 మేర తగ్గనుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ నేతృత్వంలోని బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్‌పై ఎలాంటి ఊరటా ఇవ్వలేదు.

పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తెలిపారు. 

యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సైతం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ రూ.12 మేర తగ్గనుంది.

గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది.

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హరియాణా ప్రభుత్వం తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని ఆ రాష్ట్రంలో రెండూ రూ.12మేర తగ్గనున్నాయి.  

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తూ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

  రెండు చమురు ఉత్పత్తులపై రూ.3మేర తగ్గిస్తున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad