Carona Vaccine: 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..


PM Narendra Modi: దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్ కేసుల మధ్య ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభిస్తామని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారందరికి, వివిధ రోగాలతో బాధపడుతున్నవారికి ముందు జాగ్రత్త మోతాదు ఇవ్వాలన్నారు. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో అన్ని రక్షణ చర్యలను అనుసరించాలని ప్రజలను కోరారు. అలాగే ఎవ్వరూ భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారతదేశంలో చాలా మందికి ఓమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. అయినప్పటికీ ఎవ్వరూ ఆందోళన చెందవద్దన్నారు. మాస్క్, చేతులు కడగడం విధిగా పాటించాలన్నారు. మనం తీసుకునే రక్షణ చర్యలే మనల్ని ఓమిక్రాన్‌ నుంచి కాపాడుతాయని చెప్పారు. ఇదే మన మొదటి ఆయుధమని గుర్తు చేశారు. ఇక రెండోది వాక్సినేషన్‌. పౌరులందరు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. భారతదేశం ఈ ఏడాది జనవరి 16 నుంచి దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది. దేశంలోని పౌరులందరి సమిష్టి కృషి, సమిష్టి సంకల్పమే ఈరోజు 141 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల రికార్డ్‌ సాధించిందన్నారు. చాలా కష్టమైన లక్ష్యాన్ని తక్కువ రోజుల్లోనే సాధించిందని కొనియాడారు.

నేడు భారతదేశంలోని వయోజన జనాభాలో 61 శాతం కంటే ఎక్కువ మంది టీకా రెండు మోతాదులను పొందారు. అదేవిధంగా 90 శాతం మంది ఒక డోస్‌ తీసుకున్నారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది కరోనాపై మన పోరాటాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరంగా కూడా సహాయపడుతుందని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారు వైద్యుల సలహా ప్రకారం టీకా తీసుకోవచ్చన్నారు. ఇది కూడా జనవరి 10 నుంచి అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad