Srilanka Economic Crisis: శ్రీలంకలో చేయి దాటిపోతున్న పరిస్థితులు.. మిలటరీకి ఎమర్జెన్సీ అధికారాలు

నేవీ స్థావరంలో తలదాచుకున్న మహీంద రాజపక్స

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద రాజపక్సకు నిరసన సెగ మాత్రం తప్పట్లేదు. ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్‌ ట్రీస్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకారులు గుమిగూడారు. భవనంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహీంద కుటుంబాన్ని ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరానికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఉదయం వేలాది మంది ఆందోళనకారులు మహీంద కుటుంబం నివాసముంటున్న టెంపుల్‌ ట్రీస్‌ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లను దాటుకుని భవనానికి అత్యంత సమీపంగా వచ్చారు. కొందు నిరసనకారులు భవనం కాంపౌండ్‌లోకి పెట్రోల్‌ బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. కనీసం 10 పెట్రోల్‌ బాంబులతో దాడి చేసినట్లు తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం అత్యంత భద్రత నడుమ సైన్యం మహీంద, ఆయన కుటుంబసభ్యులను నేవీ స్థావరానికి తరలించినట్లు తెలిసింది.

ఈ నేవీ బేస్‌ కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆందోళనలు వెల్లువెత్తాయి. ట్రింకోమలి నౌకాదళ స్థావరం వద్ద మహీంద, కొంత మంది కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం రాగానే నిరసనకారులు ఈ బేస్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు మహీంద కుమారుడు నమల్ కుటుంబం కొలంబో వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు మీడియా కథనాల సమాచారం.

దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి మహీంద నిన్న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిరసన జ్వాలలు ఆగట్లేదు. నిన్న దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద కేబినెట్‌ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. కరునెగాలలోని మహీంద నివాసాన్నీ దహనం చేశారు. 

Srilanka Economic Crisis: శ్రీలంకలో చేయి దాటిపోతున్న పరిస్థితులు.. మిలటరీకి ఎమర్జెన్సీ అధికారాలు

కొలంబో: శ్రీలంక దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. దేశ అధ్యక్ష భవనం ముందు నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులతో శ్రీలంక అట్టుడుకుతోంది. ఆ దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. తాజాగా.. శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స రాజీనామా తర్వాత పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాజపక్స మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య జరుగుతున్న ఘర్షణలతో కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. తాజాగా.. మిలటరీకి, పోలీసులకు ఎమర్జెన్సీ అధికారాలను అప్పగిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకుంది. ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేలా ఉందని భావించి శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.



దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలంటూ గత నెల రోజులుగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్న జనంపై సోమవారం రాజపక్స మద్దతుదారులు దాడికి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటిపోయింది. రాజపక్స బస్సుల్లో వందలాదిమంది మద్దతుదారులను రప్పించి, నిరసనకారులపై దాడి చేయించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో రెచ్చిపోయిన జనం మాజీ మంత్రులు, ఎంపీలు సహా అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలు, వాహనాలను తగలబెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపించారు.

Sri Lanka Crisis: ‘రావణ కాష్టం ’.. రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పు..!

మహీందను అరెస్టు చేయాలని డిమాండ్లు..

సైన్యం అధీనంలో అధ్యక్షుడి నివాసం


కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)లో హింసాకాండ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి ఎట్టకేలకు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మహీంద రాజీనామా చేసిన కొద్ది గంటలకే హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. దీంతో పాటు మహీంద కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు.

అటు కొలంబోలోని ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్‌ ట్రీస్‌ ముందు సోమవారం ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అత్యంత భద్రత నడుమ మహీందను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడి నివాసం ముట్టడికి యత్నం..

మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మంగళవారం ఉదయం గొటబాయ నివాసాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అధ్యక్షుడి ఇంటికి అత్యంత సమీపంలోకి వచ్చేందుకు యత్నించగా.. సైన్యం వారిని అడ్డుకుంది. ప్రస్తుతం గొటబాయ నివాసం వద్ద భారీగా సైన్యం మోహరించింది

మహీందను అరెస్టు చేయాల్సిందే..

ఇదిలా ఉండగా.. హింసకు కారణమైన మాజీ ప్రధాని మహీందను అరెస్టు చేయాల్సిందేనని ప్రతిపక్ష రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపైన ప్రభుత్వం దాడులు చేయించిందని.. ఫలితంగానే ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపించారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు ఓ ఎంపీ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మహీందను తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు, మహీంద రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దయింది. దీంతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు గొటబాయ చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే పార్లమెంట్‌ సమావేశపర్చాలని ప్రతిపక్షాలు అధ్యక్షుడిని కోరాయి.

కర్ఫ్యూ పొడిగింపు..

ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడంతో నిన్న శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఆ కర్ఫ్యూను బుధవారం వరకు పొడిగిస్తూ నిన్న అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అత్యయిక పరిస్థితుల్లో ఆందోళనకారులను అరెస్టు చేసేలా పోలీసులు, భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలిచ్చారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆర్మీ చీఫ్‌ జనరల్ శావేంద్ర సిల్వా కోరారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామన్నారు


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad