అక్షరాలా నిర్లక్ష్యం!

అనేక రంగాల్లో ముందున్నా అక్షరాస్యతలో అట్టడుగున ఏపీ

ఎక్కడుంది లోపం? ఉమ్మడి రాష్ట్ర ఆవిర్భావం నుంచీ అంతే!

వరుస ప్రభుత్వాల వైఫల్యం పార్టీల అజెండాలో చదువు లేనే లేదు

బిహార్‌లోనూ రాజకీయ అజెండాగా ‘చదువు’ సంక్షేమం, వ్యక్తిగత లబ్ధిపైనే మన దృష్టి

బడిలో చేరిన తర్వాతే ప్రోత్సాహకాలు చేరని వారిని ఎవరూ పట్టించుకోరు

కేరళ తరహా సామాజిక ఉద్యమాలూ లేవు 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో... అగ్రస్థానంలో ఏపీ!

అక్షరాస్యతలో అత్యంత అడుగున, అథమ స్థానంలో ఏపీ!

ఒక్కరోజు తేడాతో వచ్చిన వార్తలివి! ఒకటి రాష్ట్రాన్ని టాప్‌లో నిలబెడితే, మరొకటి దేశంలోనే అట్టడుగుకు చేర్చింది! అక్షరాస్యత విషయంలో ఏపీ  తడబాటు ఇప్పటి సంగతి కాదు! రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన పరిణామమూ కాదు. 1961 నుంచీ ఇదే పరిస్థితి. 2021 వస్తున్నా ఇదే గతి! ఈ దుస్థితి విద్యావేత్తలను, సామాజిక నిపుణులను కలవరపరుస్తోంది. వరుస ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తోంది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సీమాంధ్ర... తెలంగాణలాగా నిజాం పాలనలో లేదు. హిమాచల్‌ ప్రదేశ్‌లాగా కొండ ప్రాంతమూ కాదు. పైగా... పాశ్చాత్య దేశాలకు తరలి వెళ్లిన తొలితరం భారతీయుల్లో తెలుగు వారే అధికం! అయినా సరే... ఆంధ్రప్రదేశ్‌ను నిరక్షరాస్యత అనే సమస్య పట్టి పీడిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా జనగణన జరగలేదు. అయితే... 2017-18లో జాతీయ గణాంక సంస్థ నిర్వహించిన సర్వేలో అక్షరాస్యత విషయంలో 66.4 శాతంతో సీమాంధ్ర అట్టడుగున నిలిచింది. తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ నగరంలో అత్యధిక అక్షరాస్యత ఉండటం వల్లే తెలంగాణకు ఈ స్థానమైనా దక్కింది.

ఆ సంగతి పక్కన పెడితే... తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యత విషయంలో అడుగు భాగంలోనే ఉంది. ప్రతి పదేళ్లకు అక్షరాస్యత రేటు పెరుగుతున్నప్పటికీ... ఇతర రాష్ట్రాలతో పోల్చితే అది బాగా తక్కువ.  1971లో జాతీయ సగటు అక్షరాస్యత 34 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అది 25 శాతం మాత్రమే. 1997లో ఎన్‌ఎ్‌సఎ్‌సవో సర్వేలో జాతీయ సగటు అక్షరాస్యత 62 శాతంగా తేలింది. ఏపీలో ఇది 54 శాతం మాత్రమే. తాజాగా ఎన్‌ఎ్‌సవో నిర్వహించిన సర్వేలో ఏపీ 66.4 శాతం అక్షరాస్యతతో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆఖరు స్థానంలో నిలిచింది.  రాజకీయ చైతన్యంతోపాటు అనేక రంగాల్లో ముందుండే ఆంధ్రప్రదేశ్‌... అక్షరాస్యతలో మాత్రం వెనుకబడటానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. 

చిత్తశుద్ధి లోపం... 

‘పిల్లలను చదివించాలి’ అనే స్పృహ ఉన్న తల్లిదండ్రులు మాత్రమే వారిని బడులకు పంపుతున్నారు. ఆర్థిక శక్తి ఉన్న వారు ప్రైవేటు స్కూళ్లకు పంపుతుండగా... ఇతరులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. కానీ... చదువుపై ఆసక్తి, అవగాహన లేని వారిలో చైతన్యం కల్పించే కార్యక్రమాలేవీ రాష్ట్రంలో జోరుగా సాగలేదు. 1990లలో జాతీయ స్థాయిలో జరిగిన ‘అక్షరాస్యత’ కార్యక్రమమే ఆఖరు.  ఇక... ఏ పార్టీ ప్రభుత్వ వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలపై దృష్టి పెట్టాయే తప్ప, అక్షరాస్యతను పెంపొందించడం గురించి ఆలోచించలేదు. 

అన్నీ ఉన్నా... 

ఆవిర్భావం నాటితో పోల్చితే పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, వైద్యం, మాతా శిశు సంరక్షణ, వృద్ధిరేటు... ఇలా అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో మంచి ప్రగతి కనిపించింది. కానీ... అక్షరాస్యత విషయంలో మాత్రం మొదటి నుంచి కింది ఆరేడు స్థానాల్లో (రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి), అంతకంటే కిందే కనిపిస్తోంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రణాళికా సంఘం సభ్యుడిగా పని రేసిన బీపీఆర్‌ విఠల్‌ దీనికి కారణాలను గతంలో విశ్లేషించారు. ఆయన అభిప్రాయం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యాల్లో అక్షరాస్యత లేనే లేదు. విద్యుత్తు, వ్యవసాయమే ముఖ్యమనుకున్నారు. ఆ తర్వాత పరిశ్రమలకు ప్రాధాన్యం పెంచారు. 2000-01 - 2009-10 మధ్య  జాతీయ స్థాయిలో విద్యపై పెడుతున్న ఖర్చు రేషియో 17.4 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 13.3 శాతం నుంచి 10.4 శాతానికి తగ్గింది. 2008-09లో మరీ దారుణంగా 9 శాతానికి తగ్గింది. ఇదీ పాలకులు అక్షరాస్యతకు ఇచ్చిన ప్రాధాన్యం!

అక్కరకు రాని శిక్షణ...

ఎక్కువ హాస్టళ్లు, గురుకులాలు ఉన్న రాష్ట్రం మనది.  అయినా అక్షరాస్యతలో వెనుకబాటే. దీనికి ప్రధాన కారణం...  సెకండరీ, ఉన్నత విద్యలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రాథమిక విద్యకు ఇవ్వడం లేదు.  ప్రాథమిక పాఠశాలలు ‘నాన్‌ ఫార్మల్‌ కేంద్రాలు’గా మారాయి. నాలుగేళ్లు బడికి పోయినా... అక్షరాలు రాని వారు ఉన్నారు. ఉపాధ్యాయుల శిక్షణకార్యక్రమాలకు-అక్షరాస్యతకూ పొంత న లేకపోవడం మరో సమస్య అని నిపుణులు చెబుతున్నారు

 సామాజిక ఉద్యమంగా ఏదీ?

ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యతా కార్యక్రమాలు అంకెల గారడీగా మారాయి.  లక్ష్యాలను పక్కాగా నిర్దేశించుకోలేదు. మరోవైపు...కేరళ, కర్ణాటక, తమిళనాడు తరహాలో ఏపీలో  అక్షరాస్యతను పెంచేలా బలమైన సంస్కరణోద్యమాలు నడవలేదు.  అట్టడుగువర్గాల్ని విద్యవైపు కదిలించగలిగిన సా మాజిక ఉద్యమాలు పుట్టలేదు. అక్షరాస్యతపై పనిచేసే బలమైన స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట్రంలో లేవు. ఇక... రాజకీయ పార్టీల అజెండాలో కూడా ‘అక్షరాస్యత పెంపు’ అనేది లేనే లేదు. బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు విద్య/అక్షరాస్యతను తమ అజెండాలో చేర్చా యి. హిమాచల్‌ ప్రదేశ్‌ ఈ విషయంలో మరింత ముందుంది. 

హైదరాబాద్‌ను మినహాయిస్తే...

ఎన్‌ఎ్‌సవో సర్వేలో 66.4 అక్షరాస్యతతో ఏపీ అట్టడుగున ఉండగా... తెలంగాణ 72.8 శాతంతో కింది నుంచి నాలుగో స్థానం ఉంది. దీనికి కారణం... హైదరాబాద్‌! భాగ్యనగరంలో అక్షరాస్యత రేటు 83 శాతం. దీనిని మినహాయుస్తే, రెండు తెలుగు రాష్ట్రాలు అట్టడుగు స్థానాల్లోనే ఉండేవేమో! 2001 జన గణనలో  రాష్ట్ర అక్షరాస్యత 61 శాతం. ఇందులో... సీమాంధ్రలో 62.5 శాతం, రాయలసీమలో 60.7 శాతం, తెలంగాణలో 58 శాతం అక్షరాస్యత నమోదు కావడం గమనార్హం

అట్టడుగునే... 

గిరిజనుల్లో పేదరికం ఎక్కువగా ఎక్కువ. ఇక...సంచార జాతుల వారి చదువుల సంగతి ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎస్టీలు, ఎస్సీలు, వలస జీవులు... ఇలా  చదువుకు దూరమైన వర్గాలపై దృష్టి పెట్టడంలేదు. తల్లిదండ్రులు కాలానుగుణంగా సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు వలసలు వెళ్లడంతో పిల్లల్లో పాఠశాల హాజరు సరిగా ఉండటం లేదు. ఇక... వసతి గృహాల్లో సరైన పర్యవేక్షణ, నాణ్యమైన వసతులు లేకపోవడంతో బాలికలు ప్రాథమిక, ఉన్నత తరగతులు చదవడానికి బయటకు వెళ్లడం లేదు. కొన్నేళ్లకు...  చదువు మరిచిపోయి నిరక్షరాస్యులవుతున్నారు.

నిపుణుల సూచనలివి...

ప్రాథమిక విద్యపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. బాల కార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి.  బడులకు పంపని పిల్లలు ఎవరున్నారో సర్వే నిర్వహించి, తల్లిదండ్రులను ఒప్పించి స్కూళ్లకు రప్పించాలి. పిల్లలను బడికి కాకుండా పనికి పంపే కుటుంబాలకు కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తామని హెచ్చరించాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad