Google Pay:ఇక పై యాప్‌లో సరికొత్త ఫీచర్.. యూజర్‌ చేతికే అంతా

ఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నుంచి డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్‌పే తమ యూజర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. జరిగిన లావాదేవీలపై గోప్యతను మరింత బలోపేతం చేసేలా ట్రాన్సాక్షన్ హిస్టరీని తొలగించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటి కొత్త ఫీచర్..


గూగుల్ పే కొత్త ఫీచర్ భారత్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన పేమెంట్స్ విధానాలను అనుసరిస్తూ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ తీసుకురావడం ద్వారా గూగుల్ పే యూజర్‌కు డేటాపై మరింత నియంత్రణ కల్పించింది. అదే సమయంలో గోప్యతతో ఉండాల్సిన తమ సమాచారం ఎక్కడ బయటకు పొక్కుతుందో అన్న యూజర్ భయానికి చెక్ పెడుతూ భరోసా కల్పించింది గూగుల్ పే. కొత్తగా ప్రవేశ పెట్టిన ఫీచర్ వచ్చే వారం నుంచి అమలులోకి రానుంది. యూజర్ డేటా యూజర్ నియంత్రణలోనే ఉండేలా ఈ ఫీచర్ ఉంటుంది. అయితే కొత్తగా తీసుకొస్తున్న ఈ ఫీచర్ కేవలం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని, వ్యాపారస్తుల ఖాతాలకు వర్తించదని గూగుల్ పే స్పష్టం చేసింది. ఎందుకంటే వ్యాపారస్తుల డీలింగ్స్ అన్ని అప్పులు, రుణాలపైనే ఎక్కువగా ఉంటాయి కాబట్టే ప్రస్తుతం వారికి ట్రాన్సాక్షన్ హిస్టరీ డిలీట్ ఫీచర్‌ను వర్తింపజేయడం లేదని గూగుల్ తెలిపింది. 

గత 10 లావాదేవీలకు సంబంధించి.

కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు గత పది లావాదేవీలకు సంబంధించిన సమాచారం కనిపించకూడదనుకుంటే వాటిని తొలగించే ఆప్షన్ అందిస్తోంది. ఇందుకోసం ఓ టాగుల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఇలాంటి ఫీచర్‌ను పొందేందుకు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న ఈ సరికొత్త ఫీచర్‌తో గూగుల్ పే యూజర్లు డేటాను తమ నియంత్రణలో ఉంచుకునేందుకు మరింత వెసులుబాటు కల్పిస్తున్నట్లు గూగుల్ పే సంస్థ వెల్లడించింది. గూగుల్ పే యాప్ అప్‌డేట్ చేసుకున్నాక కంట్రోల్స్‌ను ఆన్ / ఆఫ్ చేసుకునే ఆప్షన్‌ను గూగుల్ కల్పిస్తోంది.


భద్రత గోప్యత కోసమే... 

భద్రత, గోప్యత అనే రెండు అంశాలు ఏ పేమెంట్ ప్రాడక్ట్స్‌కైనా అత్యంత ముఖ్యమైన అంశాలని అదే సమయంలో వినియోగదారులు కూడా పేమెంట్ సమాచారం తమ నియంత్రణలో ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంగె చెప్పారు. అంతేకాదు వ్యక్తిగత సమాచారం, లేదా లావాదేవీల చరిత్ర యాడ్స్‌ కోసం మరో గూగుల్ ప్రాడక్ట్‌‌కు షేర్ చేయడం జరగదని చెప్పారు. లావాదేవీలు పూర్తిచేసేందుకు అవసరమయ్యే సమాచారం మాత్రమే స్టోర్ చేస్తామని అది కూడా పరిమితిలోనే ఉంటుందని చెప్పారు. ఒకవేళ కస్టమర్ దీన్ని డిలీట్ చేయాలని భావిస్తే ఆ సమాచారం కూడా తమ వద్ద ఉండదని అంబరీష్ చెప్పారు. వ్యక్తిగత సమాచార నియంత్రణ యూజర్ చేతిలోనే ఉండేలా గూగుల్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందని అంబరీష్ చెప్పారు. ఇక భారత్‌లో యూపీఐ పేమెంట్స్ సంఖ్య పెరిగింది. ముఖ్యంగా వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న ఫోన్‌పే మరియు గూగుల్ పే ద్వారా అత్యధిక లావాదేవీలు జనవరి నెలకు జరిగాయి. ఫోన్ పే ద్వారా 968 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగగా... గూగుల్ పే ద్వారా 853 మిలియన్ పేమెంట్స్ జరిగాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad