CM జగన్ కు వాలంటీర్ షాకింగ్ లేఖ - పనికిరాని పథకాలు - సోమరిపోతుల్లా ప్రజలు-బతుకుహీనం....

 జగన్ కు గ్రామ వాలంటీర్ లేఖ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులతో పాటు ప్రజల్లో సైతం అసంతృప్తి వ్యక్తమవుతుందని భావిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ తాజాగా ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ రాశాడు.


AP లో YCP ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలకు ఇవి ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయనే దానిపై ప్రభుత్వం, అధికారులు కూడా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన ఓ గ్రామ వాలంటీర్ తాజాగా సంక్షేమ పథకాలను తీవ్రంగా తప్పుబడుతూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో అతను పేర్కొన్న అంశాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైసీపీ సంక్షేమ రాజ్యం ఏపీలో గతంలో సంక్షేమ ముఖ్యమంత్రిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్పుకునే వారు. ఆయన హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండోసారి అధికారం కట్టబెట్టాయి. ఆ తర్వాత ఆయనకు పది రెట్లు సంక్షేమాన్ని ప్రజలకు రుచి చూపించాలని నిర్ణయించుకున్న ఆయన తనయుడు సీఎం జగన్ తన ప్రభుత్వంలో సంక్షేమాన్ని భారీగా పెంచేశారు. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా లెక్కచేయకుండా అప్పు చేసి అయినా పప్పు కూడు పెట్టాల్సిందేనని జగన్ భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మరింత భారీ అప్పుల్లో కూరుకుపోతోంది. మరోవైపు ఇంత ఖర్చుపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అయినా ప్రజలకు పనికొస్తున్నాయా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. దీంతో వీటిపై ప్రభుత్వ వర్గాల్లోనే అసంతృప్తి పెరుగుతోంది.


శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం రావిచెంది గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ చిట్టివలస కృష్ణ అనే వాలంటీర్ ఈ లేఖ రాశాడు. ఇందులో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా విమర్శించాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్ర భవిష్యత్తుపై సదరు వాలంటీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ లేఖలో వాలంటీర్ ప్రస్తావించిన అంశాలపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


పనికిరాని పథకాలతో జనం సోమరిపోతులుగా ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారిపోతున్నారంటూ ఈ లేఖలో సదరు వాలంటీర్ ఆరోపించాడు. ప్రభుత్వం పనికిరాని పథకాలను తీసుకొచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తోందని, వీటితో ప్రజల్ని సోమరిపోతులుగా మార్చొద్దంటుూ తన లేఖలో వాలంటీర్ కృష్ణ ప్రభుత్వానికి సూచించాడు. జగన్ పథకాలపై కాక ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని వాలంటీర్ కోరాడు. దీంతో వాలంటీర్ లేఖలో పేర్కొన్న అంశాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ లేఖ కాస్తా వైరల్ కావడంతో ఇందులో అంశాల్ని అధికారులు కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.


అధికారులు అవినీతి చేస్తుంటే వాలంటీర్లు... అధికారులు, సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని తన లేఖలో గ్రామ వాలంటీర్ కృష్ణ ఆరోపించాడు. అదే సమయంలో ప్రభుత్వం నియమించిన వాలంటీర్లకు ఇస్తున్న 5 వేలు పెట్రోలుకు కూడా చాలడం లేదని విమర్శించాడు. ఉద్యోగత భద్రత లేక, ఎటూ వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు వాలంటీర్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.. తమను అందరూ హీనంగా చూస్తున్నారని కృష్ణ తెలిపాడు. దీంతో కృష్ణ రాసిన లేఖపై అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వాలంటీర్లను స్వచ్ఛంద సేవకులని చెబుతూ వారికి రూ.5వేలు మాత్రమే ఇవ్వడంపై గతంలోనూ విమర్శలు వచ్చినా మధ్యలో సీఎం జగన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు.


పింఛన్లలో కోతలపైనా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సామాజిక పించన్లలో కోతలు విధిస్తోంది. ఈ-కేవైసీ చేయించుకోని వారికి కోతలు పడుతున్నాయి. ఇందుకోసం జనం ఆధార్ కేంద్రాల వద్ద క్యూలు కట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పింఛన్లపైనా వాలంటీర్ కృష్ణ ఆరోపణలు చేశాడు. పింఛన్ నిబంధనలు తాజాగా మార్చేశారని, దీంతో ఈకేవైసీ లేకుంటే పెన్షన్ కూడా రావడం లేదని ఆరోపించాడు. ఆ బకాయి పింఛన్ కూడా ఈ నెల ఇవ్వొద్దంటున్నారని కృష్ణ వెల్లడించాడు. పదెకరాల భూములు ఉన్న వారికి కూడా పించన్ అందుతోందని, కానీ నిరుపేదలు మాత్రం ప్రభుత్వ నిబంధనలతో దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. పింఛన్ల కోతలపై ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో వాలంటీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఆక్రోశం అలా బయటకి వచ్చిందా ? ప్రభుత్వం వాలంటీర్లను స్వచ్ఛంద సేవ చేయాలంటూ రూ.5వేలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తోంది. ఇందులోనూ మెరుగ్గా పనిచేసిన వారికి ఉగాది పురస్కారాలు కూడా ఇస్తోంది. అయితే వేతనాలపై ఎప్పటినుంచో వారిలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉండిపోయింది. అదే సమయంలో వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుండటం సదరు వాలంటీర్ లో తీవ్ర అసంతృప్తి నింపినట్లు అతని లేఖలో ప్రస్తావించిన అంశాలను చూస్తే అర్ధమవుతోంది. అదే సమయంలో పింఛన్ల కోతలతో వాలంటీర్లపై పెరుగుతున్న ఒత్తిడి కూడా తన లేఖలో స్పష్టమైంది. ప్రభుత్వం పై స్దాయిలో పింఛన్ల కోతల నిర్ణయం తీసుకున్నప్పటికీ నేరుగా ప్రజలతో ఉంటే వాలంటీర్ల వ్యవస్ధపై ఒత్తిడి ఎక్కువైంది. అదే సమయంలో ధనవంతులు, మోతుబరులు ప్రభుత్వ పథకాలను అడ్డదారుల్లో పొందుతుండటంపై వాలంటీర్ వ్యక్తం చేసింది ధర్మాగ్రహమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిస్ధితుల్ని చూశాక ప్రభుత్వంపై పెరుగుతున్న ఆక్రోశంతోనే అతను ఈ లేఖ రాసి ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad